స్మశానంలో నిద్రించిన టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు, కేరళ సీఎం పినరాయి ట్వీట్

  • 6 years ago
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు రెండు రోజుల పాటు స్మశానంలో నిద్ర చేశారు. అంతేకాదు, ఉదయాన్నే అక్కడే కాలకృత్యాలు తీర్చుకున్నారు. ఇలా చేయడానికి కారణం ఉంది. అభివృద్ధి పనులు నిలిచిపోవడంతో ఆయన ఇలా చేశారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ఎనిమిది నెలల క్రితం ఆ స్మశానం అభివృద్ధికి నిధులు మంజూరు అయ్యాయని, అయితే అది స్మశానం కావడం.. దెయ్యాలు ఉంటాయని భయపడుతు పలువురు పని చేయడానికి ముందుకు రాలేదన్నారు.
దీంతో వారిలో భయం పోగొట్టేందుకు తాను స్మశానంలో పడుకున్నానని తెలిపారు. ఈ స్మశానం అభివృద్ధికి ప్రభుత్వం రూ.మూడు కోట్లకు పైగా మంజూరు చేసిందని తెలిపారు. ఆయన శుక్రవారం అక్కడే బస చేసి, శనివారం అక్కడే అల్పాహారం తీసుకున్నారు. అక్కడే గెడ్డం గీసుకున్నారు. స్నానం చేశారు. తర్వాత నియోజకవర్గంలో పర్యటించారు. ఆ తర్వాత శనివారం రాత్రి మళ్లీ వచ్చి అక్కడే బస చేశారు. దీనిపై కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కూడా స్పందించారు. టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు స్మశానంలో నిద్ర చేశారని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఆత్మలు ఉంటాయని అందరు భయపడితే అతను నిద్రించారని పేర్కొన్నారు.

Recommended